ముంబయి: వరుసగా రెండో సమీక్షలోనూ భారత రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో ద్వైమాసిక ద్రవ్య పరపతి
విధాన సమావేశం జులై 30 నుంచి మూడు రోజుల పాటు జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా కీలక వడ్డీరేట్లను పావుశాతం మేర పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీని ప్రకారం.. ప్రస్తుతం 6.25శాతంగా ఉన్న రెపో రేటు 6.౫౦ శాతానికి పెరగగా, రివర్స్ రెపో రేటు కూడా 6శాతం నుంచి 6.25శాతానికి పెరిగింది. ఇక ఎంఎస్ఎఫ్ రేటు, బ్యాంకు రేటును 6.75శాతంగా వెల్లడించింది. ఈసారి సమీక్షలో కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉండొచ్చని కొందరు అంచనా వేశారు. కానీ దేశీయంగా చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో వడ్డీరేట్ల పెంపుకే ఆర్బీఐ మొగ్గుచూపింది. దీంతో వరుసగా రెండు సార్లు ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచినట్లయింది. జూన్లో జరిగిన రెండో ద్వైమాసిక సమీక్షలోనూ ఆర్బీఐ పావుశాతం మేర వడ్డీరేట్లు పెంచింది.