హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రారంభం కానుంది. భారతదేశ
కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 9.15 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి 50వేల మంది భారత సంతతి ప్రజలు పాల్గొననున్నారు. అమెరికా చరిత్రలో పోప్ మినహా ఓ విదేశీ నేత పాల్గొనే సభకు ఈ స్థాయి జనం హాజరుకానుండటం ఇదే తొలిసారి. ఈ ఈవెంట్లో ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా పాల్గొననున్నారు. దీంతో ఏర్పాట్లు భారీగా చేశారు. కాగా... సుమారు 600 సంస్థలు కలిసి 1500మంది వలంటీర్లతో ఈ ఈవెంట్ ను నిర్వహిస్తుండడంతో విశ్వవ్యాప్తంగా ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా... ఇటీవల కశ్మీర్ విషయంలో మోదీ తీసుకున్న సంచలన నిర్ణయం అనంతరం అంతర్జాతీయంగా వచ్చిన విమర్శలను మోదీ తిప్పికొట్టేందుకు ఈ సభను వేదిక చేసుకుంటారని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా అమెరికా అధ్యక్షునితో కలిసి అమెరికాలో సభ నిర్వహించడమనేది అంతర్జాతీయ ప్రజాసంబంధాలు, అలాగే... అమెరికా, భారత్ మధ్య బలమైన బంధం ఉందని చాటి చెప్పేందుకు ఉదాహరణగా ఈ ఈవెంట్ సాక్ష్యం కానుంది.